మరో యుద్ధం జరగొచ్చు... అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక!

  • ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ సలహాదారు యాహ్యా రహీమ్ సఫావీ హెచ్చరిక
  • బలహీనంగా ఉంటే ఈ ప్రపంచంలో నలిగిపోతామని వ్యాఖ్య
  • క్షిపణి, డ్రోన్, సైబర్ దాడుల సామర్థ్యం పెంచుకోవాల్సి ఉందని వెల్లడి 
మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. అమెరికా లేదా ఇజ్రాయెల్‌తో ఎప్పుడైనా మరో యుద్ధం సంభవించవచ్చని ఇరాన్ సంచలన హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత కీలకమైన సైనిక సలహాదారు యాహ్యా రహీమ్ సఫావీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే తమ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

స్థానిక మీడియాతో మాట్లాడుతూ, ఇరాన్ ప్రస్తుతం శాంతియుత పరిస్థితుల్లో లేదని, యుద్ధ వాతావరణంలోనే ఉందని సఫావీ స్పష్టం చేశారు. "మేము శాంతి ఒప్పందంలో లేము, యుద్ధ స్థితిలో ఉన్నాము. అమెరికా లేదా ఇజ్రాయెల్‌తో మాకు ఎలాంటి ఒప్పందం లేదు. మరో యుద్ధం జరగవచ్చు, ఆ తర్వాత బహుశా యుద్ధాలు ఉండకపోవచ్చు" అని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రపంచంలో బలహీనంగా ఉన్న దేశాలు నలిగిపోతాయని, అందుకే ఇరాన్ తనను తాను బలోపేతం చేసుకోవాలని ఆయన అన్నారు. రక్షణ, దాడితో పాటు దౌత్య, మీడియా, క్షిపణి, డ్రోన్, సైబర్ రంగాల్లోనూ ఇరాన్ శక్తివంతంగా మారాలని సూచించారు. "మేము సైనికులుగా అత్యంత దారుణమైన పరిస్థితులను ఊహించే ప్రణాళికలు సిద్ధం చేస్తాం" అని యాహ్యా రహీమ్ సఫావీ తెలిపారు.

ఈ వేసవిలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల తర్వాత ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. జూన్‌లో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు టెహ్రాన్‌లోని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) కమాండ్ సెంటర్లు, ఇతర స్థావరాలపై దాడులు చేశాయి. ఈ దాడులతో ఇరాన్ క్షిపణి, అణు కార్యక్రమాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. తమ దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్న ఇరాన్ అణు, బాలిస్టిక్ క్షిపణి ముప్పును తొలగించేందుకే ఈ ఆపరేషన్ ప్రారంభించామని ఆయన అన్నారు.

అదే సమయంలో, 'ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్' పేరుతో జూన్‌లో ఇరాన్‌లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లలో ఉన్న మూడు ప్రధాన అణు కేంద్రాలపై దాడులు చేసినట్లు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ కూడా ధృవీకరించింది. తాజాగా ఇరాన్ చేస్తున్న హెచ్చరికలతో మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ భయాలు నెలకొన్నాయి.

Yahya Rahim Safavi
Iran
America
Israel
Middle East tensions
nuclear program
military
attack
war

More Telugu News